అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ ఆదాయం 25శాతం పెరిగినట్టు దేవదాయశాఖ రాష్ట్ర కమిషనర్ కె.రామచంద్రమోహన్ తెలిపారు. రామచంద్ర మోహన్ దంపతులు కుటుంబ సమేతంగా శుక్రవారం అమ్మవారిని దర్శి ంచుకుని ప్రత్యేక పూజలు చేసి, పట్టు వస్త్రాలు సమసర్పించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ నూతన ఆలయంలో భక్తుల తాకిడిపెరుగుతోందని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆదాయం తక్కువగా ఉన్న 165 దేవాలయాలను రూ.180 కోట్ల సీజీఎస్ నిధులతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో దేవదాయశాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు. అంతకు ముందు రామచంద్రమోన్ దంపతులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ జిల్లా కమిషనర్ శోభారాణి, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


