ప్రమాదానికి గురైన బలోరా, ద్విచక్ర వాహనాలు, క్షతగాత్రులు
చింతపల్లి: గూడెం కొత్తవీధి మండలం రింతాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గిరిజనుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ కూర్మన్నపాకలు గ్రామానికి చెందిన కొర్రా కోటిబాబు, పాంగి అప్పారావు వ్యక్తిగత పనులపై గూడెంకొత్తవీధి బైక్పై బయలుదేరారు. మార్గంమధ్యలో రింతాడ, ముల్లుమెట్ట గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న అంబులెన్సును తప్పించబోయి ఆగిఉన్న బొలారో వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్లో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరికి వైద్యాధికారి చందన వైద్యసేవలు అందించారు. చికిత్స పొందుతూ పాంగి అప్పారావు (28) మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కోటిబాబును మెరుగైన వైద్యం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు.


