సింథియా: తోటి మనిషి ప్రాణాన్ని కాపాడటం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన తూర్పు నావికాదళ పెట్టీ ఆఫీసర్, దివంగత దీపక్ కుమార్ వీరోచిత త్యాగానికి భారతావని అత్యున్నత పురస్కారంతో నివాళులర్పించింది. మానవత్వంతో ఆయన చూపిన అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత రాష్ట్రపతి ప్రకటించిన ‘సర్వోత్తమ జీవన్ రక్షా పతకాన్ని’ ఏప్రిల్ 1న ముంబైలో జరిగిన నావికా దళ పురస్కార వేడుకలో ప్రదానం చేశారు. భారత నావికాదళ అధిపతి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును దీపక్ కుమార్ సతీమణి రౌషానీ కుమారి కన్నీటి పర్యంతమవుతూ అందుకున్నారు. ఆ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ దీపక్ కుమార్ చేసిన త్యాగాన్ని తలచుకుని నిశ్శబ్దంగా నివాళులర్పించారు.
ఏం జరిగిందంటే?
2024, సెప్టెంబర్ 14న అనకాపల్లి జిల్లా దేవరాపల్లి సమీపంలో గల సరియా జలపాతం వద్ద ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన నీటి ఉధృతికి ఒక వ్యక్తి కొట్టుకుపోతుండగా, ఏమాత్రం ఆలోచించకుండా దీపక్ కుమార్ నీటిలోకి దూకారు. ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, వరద ఉధృతి అత్యంత బలంగా ఉండటంతో ఇద్దరూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి వీరమరణం పొందారు. దీపక్కుమార్ చేసిన ఈ మహోన్నత త్యాగం భారత నావికాదళం అత్యున్నత సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఆయన అకుంఠిత ధైర్యానికి భారత నావికాదళం వందనం చేస్తూ, ఈ అవార్డు ద్వారా దేశం ఆయన వీరోచిత గాథను శాశ్వతంగా స్మరించుకుంటుందని తెలిపారు.


