పీఏసీఎస్ ఉద్యోగుల ధర్నా
ఆర్డీవో కార్యాలయం వద్ద ఽనిరసన దీక్ష చేస్తున్న పీఏసీఎస్ ఉద్యోగులు
నర్సీపట్నం: స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఉమ్మడి విశాఖ జిల్లా వ్యవసాయ పరపతి సంఘంలో పని చేస్తున్న ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మణరావు మాట్లాడుతూ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు డీసీసీబీ కాకుండా పీఏసీఎస్ ద్వారా రుణాలు మంజూరు చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ 2019 మార్చిలో జీవో నంబరు 36 విడుదల చేసినా నేటికీ అమలు చేయలేదన్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా తయారైందన్నారు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా పీఏసీఎస్ ఉద్యోగులకు తక్షణమే అమలు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలన్నారు. ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు చిరంజీవి, పీఏసీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.


