జన సైనికుడికి ఝలక్
నక్కపల్లి : రైతులకు చెందిన సుమారు రూ.4 కోట్లు విలువైన జిరాయితీ మిగులు భూమిని అక్రమంగా తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుని పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన జనసేన నాయకుడు, అమలాపురం ఉప సర్పంచ్ గంటానర్సింగరావు అలియాస్ గబ్బర్సింగ్కు ఆర్వోఆర్ కోర్టు ఝలక్ ఇచ్చింది. గబ్బర్సింగ్ చేయించుకున్న రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాసుపుస్తకాలు రద్దుచేస్తూ నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలివి. మండలంలో వేంపాడు రెవెన్యూ పరిధిలో 276/1లో ఎ.7.36ఎకరాల జిరాయితీ భూమి ఉంది. రెవెన్యూ రికార్డులు ఎస్ఎఫ్ఏలో ఈ భూమి గ్రామానికి చెందిన కల్లేపల్లి కుటుంబీకుల పేరున నమోదై ఉంది. దాదాపు 60 ఏళ్ల నుంచి వీరి సాగులోనే ఉంది. ఉమ్మడి కుటుంబం కావడంతో పంపకాల్లో ఏర్పడిన వివాదాల వల్ల 7.30 ఎకరాల భూమిని ఖాళీగా వదిలేశారు. రీసర్వేలో ఈ భూమి ని వారసుల పేరున నమోదు చేయించుకునే ఆలోచనలో ఉన్న సమయంలో ఈ భూమిని జనసేన నాయకుడు గబ్బర్ సింగ్ 2024 మే 30న దస్తావేజు నెంబరు 9493/24తో తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వేంపాడు, అమలాపురం, తదితర గ్రామాల పరిదిలో ఏపీఐఐసీ వారు పరిశ్రమల కోసం భూములు సేకరించింది. అదే సమయంలో సర్వే బృందాలతోపాటు సాన్నిహిత్యం సంపాదించిన గబ్బర్ సింగ్ ఈ మిగులు భూమిని గుట్టుచప్పుడు కాకుండా అదే గ్రామానికి చెందిన మడగల గోవిందు పేరున 2012లో ఖాతానెంబరు 832తో ఆన్లైన్ చేయించాడు. తర్వాత ఇదే భూమిని సెప్టెంబరు 2024లో ఖాతానెంబరు 1104తో గంటా అప్పారావు పేరుతో ఆన్లైన్ చేయించాడు. తరువాత నేరుగా తన పేరున ఆన్లైన్ చేయిస్తే అనుమానం వస్తుందని ఉద్దేశ్యంతో గోవిందు పేరున ముందు ఆన్లైన్ చేయించి తర్వాత తన తండ్రి పేరున ఆన్లైన్ చేయించి తర్వాత తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో పాటు ఖాతానెంబరు 2454తో పట్టాదారు పాసుపుస్తకాలు సంపాదించాడు.దీనిపై ‘జనసేనకు మిగులు భూములు’ అనే శీర్షికన గత ఏడాది జనవరి 31న సాక్షి దినపత్రికలో కథనం కూడా వెలువడింది. ప్రస్తుతం ఈ భూమి విలువ బయట మార్కెట్లో రూ.4 కోట్లు పైనే ఉంటుంది. గబ్బర్ సింగ్ తమ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడన్న విషయం తెలుసుకున్న కల్లేపల్లి వెంకటపతిరాజు, కల్లేపల్లి సీతారామరాజు, కల్లేపల్లి సత్యనారాయణరాజు, కల్లేపల్లి నాగరాజు, కల్లేపల్లిరామరాజు తదితరులు తహసీల్దార్తోపాటు, నర్సీపట్నం ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఆర్వోఆర్ కోర్టుకు చేరింది. దీంతో జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు అప్పిలేట్ అధికారి ఆయిన ఆర్డీవో ఇరు పార్టీలకు నోటీసులు జారీ చేశారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న నర్సింగరావుతోపాటు, ఆన్లైన్ చేయించుకున్న అప్పారావు, గోవిందులు ఆర్డీవో కోర్టుకు హాజరై వివాదాస్పద భూములపై తమకున్న హక్కులను సమర్పించలేకపోయారు. దీంతో రెవెన్యూ రికార్డులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఏడాది పాటు వాదోపవాదాలు విన్న తర్వాత ఈ భూమి కల్లేపల్లి వారసులకే చెందుతుందని అప్పిలేట్ అధికారి నర్సీపట్నం ఆర్డీవో రమణ ఉత్తర్వులు జారీ చేశారు. గంటా నర్సింగరావు అలియాస్ గబ్బర్ సింగ్ పేరున జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
జన సైనికుడికి ఝలక్


