మార్చి 25న ఏయూ స్నాతకోత్సవం
మద్దిలపాలెం: ఎట్టకేలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం 91, 92వ సంయుక్త స్నాతకోత్సవం మార్చి 25న బీచ్రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గతంలో దరఖాస్తు చేసిన వారందరూ స్నాతకోత్సవ పట్టాలను అందుకోనున్నారని, వారంతా ఉదయం 10 గంటలకు ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు. అయితే ఏయూలో ఎన్నో దశాబ్దాలుగా స్నాతకోత్సవాలకు వేదికగా నిలిచిన కట్టమంచి రామలింగేశ్వరరావు స్నాతకోత్సవ ప్రాంగణం ప్రస్తుతం శిథిలావస్థలో ఉండడం గమనార్హం. ఈ ప్రాంగణంలో గతంలో నిర్వహించిన స్నాతకోత్సవాల్లో అనేక మంది ప్రముఖులు గౌరవ డాక్టరేట్లు స్వీకరించారు. విశ్వవిద్యాలయ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిన ఈ వేదిక ఇప్పుడు నిర్లక్ష్యానికి గురైందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయ వేదికను పక్కనబెట్టి కన్వెన్షన్ సెంటర్లో స్నాతకోత్సవం నిర్వహించడంపై కొంతమంది విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాంగణంలో పట్టాలు స్వీకరించాలని కలలు కన్న తమ ఆశలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


