గంగపుత్రులు మురవంగ.. నూకతాత పండగ
వింత ఆచారం, వినూత్న సంప్రదాయం భక్తి శ్రద్ధలతో రాజయ్యపేట నూకతాత పండగ రోడ్డుపై పడుకుని మొక్కు చెల్లించుకున్న భక్తులు
నక్కపల్లి : వింత ఆచారం, వినూత్న సంప్రదాయంతో చూడడానికి ఎంతో ఆసక్తి కలిగించడం అబ్బుర పరిచే విధంగా ఉండే నూకతాత పండుగను మంగళవారం మత్స్యకారులు అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జిల్లాలో కనీవినీ ఎరుగని వింత ఆచారంతో ఈ పండగను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది మత్స్యకారులు అధికంగా ఉండే రాజయ్యపేటలో ఈ పండగను తరతరాలుగా నిర్వహిస్తున్నారు. ప్రతిఏటా మహాశివరాత్రి అమావాస్య మరుసటిరోజు రాజయ్యపేటలో ఈ నూకతాత పండగ జరుగుతుంది. నూకతాతను గంగపుత్రులు తమ కులదైవంగా, ఆరాధ్య దైవంగా భావిస్తారు. ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నూకతాత పండగను మూడురోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవంలో భాగంగా మంగళవారం నూకతాత విగ్రహాలను సముద్రస్నానానికి తీసుకెళ్లారు. తిరిగి ఆలయానికి విగ్రహాలను తీసుకొచ్చే సమయంలో భక్తులు రోడ్డుపై పడుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇలా రోడ్డుపై పడుకున్న భక్తులపై నుంచి విగ్రహాలను చేతపట్టిన పూజాలు దాటుకుంటూ వెళ్లారు. ఇలా పడుకుని మొక్కులు చెల్లించుకోవడం ద్వారా తమ కోర్కెలు నెరవేరుతాయనేది మత్య్సకారుల నమ్మకం. గత ఏడాది కోరిన కోర్కెలు నెరవేరిన వారు ఈ ఏడాది కొత్తకోర్కెలు కోరుకునే వారు ఇలారోడ్డుపై పడుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఇలా మొక్కు చెల్లించుకుంటే నూకతాత అనుగ్రహం తమపై ఎల్లవేళలా ఉంటుందనేది గంగపుత్రుల నమ్మకం. సాధారణంగా గ్రామాల్లో నిర్వహించే పండగలు జాతరల్లో కోళ్లను మేకలను బలిఇస్తారు. నూకతాత పండుగలో మాత్రం బలి నిషేధం. రక్తం చిందించడాన్ని నూకతాత ఒప్పుకోడని మత్స్యకారులు చెబుతారు.
నూకతాత పండుగను పురస్కరించుకుని గ్రామంలో పెద్ద తిరునాళ్లు జరిగింది. భారీ సెట్టింగులు ఏర్పాటు చేశారు. బాణ సంచాల సంబరాలు మిన్నంటాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ మురళి, ఎస్ఐలు సన్నిబాబు, సాహెబాఅంజుమ్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒడిశా, పూరీ, పరదీప్, శ్రీశైలం, నాగార్జునసాగర్ తదితర దూరప్రాంతాల్లో స్థిరపడిన వారంతా నూకతాత పండక్కి రాజయ్యపేట చేరుకున్నారు. బంధువులు, స్నేహితుల రాకతో గంగపుత్రుల ఇళ్లన్నీ కళకళలాడాయి. నూకతాత ఆలయాన్ని పాయకరావుపేట సమన్వయకర్త, ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు, జెడ్పీటీసీ గోసల కాసులమ్మ, వైస్ ఎంపీపీలు, వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, శీరం నర్సింహమూర్తి, పార్టీ రైతు విభాగం రాష్ట్రకార్యదర్శి సూరాకాసుల గోవిదందు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు కొప్పిశెట్టి హరిబాబు, తళ్ల భార్గవ్, పాడగట్ట పాపారావు, గంటా తిరుపతిరావు, గొర్ల గోవిందురావు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కొప్పిశెట్టి వెంకటేష్, పీఏసీఎస్ అధ్యక్షుడు కొిప్పిశెట్టి బుజ్జి తదితరులు దర్శించుకున్నారు. సమన్వయకర్త కంబాల జోగులు నూకతాత విగ్రహాలను నెత్తిన పెట్టుకుని ఆశీస్సులు తీసుకున్నారు.
గంగపుత్రులు మురవంగ.. నూకతాత పండగ


