వీధి కుక్కల బెడద ఉండదిక
● నర్సీపట్నంలో
కు.ని శస్త్ర చికిత్సలకు చర్యలు
● ఒక్కో కుక్కకు రూ.1500 కేటాయింపు
నర్సీపట్నం: వీధి కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. సంతతిని నియంత్రించేందుకు వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఎవరినైనా కరిచినా ప్రాణాపాయం లేకుండా యాంటీర్యాబిస్ టీకాలు వేస్తున్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో శస్త్రిచికిత్స గదులను ఏర్పాటు చేశారు. ఒక్కో కుక్కకు ఆపరేషన్, టీకా, బలవర్థక ఆహారం ఇచ్చేందుకు రూ.1500 వరకు ఖర్చు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇందు కోసం పురపాలిక సాధారణ నిధుల నుంచి వెచ్చిస్తున్నారు. పురపాలక పరిధిలో 28 వార్డులు ఉన్నాయి. ప్రజలు సుమారు లక్ష మంది ఉన్నారు. వీధి కుక్కలు 744 వరకు ఉన్నాయి. ఆపరేషన్, యాంటీ ర్యాబిస్ టీకాలు పూర్తయినవి 244 వరకు ఉన్నాయి. పట్టణంలో మొత్తం 744 వీధి కుక్కలు ఉన్నట్లు ఆరు నెలల క్రితం అంచనా వేశారు. వీటికి ఆపరేషన్లు, యాంటీర్యాబిస్ టీకా వేయడానికి, ఆపరేషన్ అనంతరం అయిదు రోజుల పాటు బలవర్థక ఆహారం పెట్టేందుకు స్నేహ వెల్ఫేర్ యానిమల్ సొసైటీతో ఒప్పందం చేసుకున్నారు. ఆ సొసైటీ ఆధ్వర్యంలో ఇద్దరు పశువైద్యులు కుక్కలకు సంతానోత్పత్తి వృద్ధి చెందకుండా ఆపరేషన్లు చేస్తున్నారు. ఆపరేషన్ తరువాత ఉంచేందుకు ఇనుప బోనెలను సిద్ధం చేశారు. ఐదు రోజుల పాటు బలవర్థక ఆహారం పెట్టి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించిన తరువాత బయటకు విడిచిపెడుతున్నారు. ఏమాత్రం తేడా ఉన్నా వైద్యుల పర్యవేక్షణలోనే మరికొన్ని రోజులు ఉంచి, పూర్తిగా కోలుకున్న తర్వాత బయటకు వదులుతున్నారు.
కుక్కల బెడద లేకుండా చేస్తాం
పట్టణంలో కుక్కల బెడద లేకుండా చేస్తాం. కుక్కలకు ఆపరేషన్, యాంటీర్యాబిస్ టీకాలు వేసేందుకు మొదటి విడతలో సుమారుగా రూ.6 లక్షలు కేటాయించాం. 244 కుక్కలకు ఆపరేషన్లతో పాటు యాంటీర్యాబిస్ టీకాలు వేశాం. మిగిలిన వాటికి ఆపరేషన్లు, యాంటీర్యాబిస్ టీకాల వేసే ప్రక్రియ నడుస్తోంది. త్వరలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేస్తాం.
– జంపా సురేంద్ర, కమిషనర్, నర్సీపట్నం
వీధి కుక్కల బెడద ఉండదిక


