కేజీహెచ్లో ‘మెమరీ క్లినిక్’ ప్రారంభం
మహారాణిపేట: కేజీహెచ్ న్యూరాలజీ విభాగంలో శుక్రవారం మెమరీ క్లినిక్ ప్రారంభమైంది. ఈ క్లినిక్ ఏర్పాటుకు ఈసాయి ఫార్మా సంస్థ సహాయం అందించింది. ఈ సందర్భంగా కేజీహెచ్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్.గోపీ మాట్లాడుతూ జ్ఞాపకశక్తి మందగించడం, మతిమరుపు, అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు, సలహాలు అందించడానికి ఈ ప్రత్యేక క్లినిక్ను ప్రారంభించినట్లు తెలిపారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, ఏఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి ఈ క్లినిక్ను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో సీఎస్ఆర్ఎంవో డాక్టర్ యు.శ్రీహరి, అడ్మినిస్ట్రేర్ బి.వి.రమణ, ఆర్ఎంవో డాక్టర్ ఎ.రాజేష్, ఈసాయి ఫార్మా ప్రతినిధులు గిరీష్, జోసెఫ్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.


