మునగపాకను అనకాపల్లి డివిజన్లోనే ఉంచాలి
మునగపాక : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని అయితే మునగపాక మండలాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో కొనసాగేలా పరిశీలించాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ కోరారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రెవెన్యూ డివిజన్ కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం మంచి పరిణామమే అయినప్పటికీ ఎప్పటి నుంచో మునగపాక మండలం అనకాపల్లి డివిజన్లో ఉండేదని, నేడు మార్పు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. సుదూర ప్రాంతమైన నక్కపల్లికి వెళ్లాలంటే వ్యయ ప్రయాస ఎదురవుతుందన్నారు. గతంలో విశాఖపట్నంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఉండేదని, అపుడు కూడా ప్రజలు తమ పనుల కోసం వెళ్లాలంటే ఇబ్బందులు పడిన సంఘటనలు గుర్తు చేశారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిపాలనా పరమైన ఇబ్బందులు లేకుండా అందరికీ సౌలభ్యంగా ఉండేలా అనకాపల్లిలో రెవెన్యూ డివిజన్ను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. దీంతో అన్ని వర్గాల ప్రజలకు సకాలంలో సేవలందేవన్నారు. కూటమి ప్రభుత్వం నూతనంగా తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించాలన్నారు. 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్కపల్లి డివిజన్లో యలమంచిలి నియోజకవర్గం కూడా కలపడం సరైన నిర్ణయం కాదన్నారు. ఇప్పటికై నా జిల్లా మంత్రి అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరికీ సేవలందేలా అనకాపల్లి డివిజన్లోనే మునగపాక మండలం కొనసాగేలా చూడాలని ప్రసాద్ కోరారు.


