13న ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ముఖ్య అతిథిగా సుధామూర్తి
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. డిసెంబర్ 13న ఏయూ పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ మంగళవారం ఈ విషయాన్ని ప్రకటించారు. 1926లో స్థాపించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం 2026 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో.. శతాబ్ది ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి సర్ సి.ఆర్.రెడ్డి జయంతిని పురస్కరించుకుని, ఏయూ అల్యూమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్లో వార్షిక పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శతాబ్ది సంవత్సరంలో జరగనున్న ఈ ప్రత్యేక వేడుకలకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్పర్సన్ సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఏయూఏఏ వ్యవస్థాపక చైర్మన్ డా. జి.ఎం.రావు, ఏయూ ఉపకులపతి ప్రొఫెసర్ జి.పి.రాజశేఖర్, ఏయూఏఏ చైర్మన్ కె.వి.వి.రావు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఈ మేరకు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఈ సమ్మేళనం జరగనుందని వీసీ వెల్లడించారు.


