
పల్లె పండగ.. బిల్లులకు నిరీక్షణ
జిల్లాలో రావాల్సిన మొత్తం రూ.130 కోట్ల పైనే
ఏడాది కాలంగా బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఎదురుచూపులు
మరోవైపు రెండో విడత ‘పల్లె పండగ‘కు సిద్ధమవుతున్న ప్రభుత్వం
బిల్లులు రాకపోవడంతో కొన్ని చోట్ల ఆగిన పనులు
సాక్షి, అనకాపల్లి:
తొలి విడత ‘పల్లె పండగ’ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారు. గతేడాది అక్టోబర్లో తలపెట్టిన పల్లె పండగ పనులకు సంబంధించి బిల్లులు ఇప్పటికీ విడుదల కాలేదు. తాజాగా రెండో విడత పల్లె పండగ పనులకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడం కాంట్రాక్టర్లకు మింగుడు పడడం లేదు. జిల్లాలో తొలి విడతలో చేపట్టిన పనుల బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో సగం పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆ నిధులు ఎప్పుడొస్తాయా? అని కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. గతేడాది అక్టోబర్ 14వ తేదీ నుంచి ‘పల్లె పండగ’పేరిట గ్రామాల్లో సభలు నిర్వహించి సీసీ రోడ్లు, కాలువలు, ఇతర నిర్మాణాలను చేపట్టేందుకు వినతులు స్వీకరించారు. తొలి విడతలో పూర్తయిన పనుల బిల్లులు అధికారులు అప్లోడ్ చేశారు. నెలలు గడుస్తున్నా నిధులు విడుదల కాలేదు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు అసంపూర్తిగానే పనులు నిలిపివేశారు.
రూ.11 కోట్లు మాత్రమే విడుదల
జిల్లాలో 166 కిలోమీటర్ల పొడవున 1,354 రోడ్ల నిర్మాణ పనులకు రూ.143 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు బిల్లులు అప్లోడ్ చేశారు. ఇంత వరకు రూ.11 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. ఇంకా రూ.132 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గత సంవత్సరం నవంబరు నుంచి ‘పల్లె పండగ’ పేరుతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, రోడ్లు మరమ్మతులు వంటి నిర్మాణ పనులు మొదలయ్యాయి.
ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద 189 కిలోమీటర్ల పొడవు గల 1,734 రోడ్డు నిర్మాణ పనులు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో ఈ పనులు ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం కాబట్టి బిల్లులు త్వరగా మంజూరవుతాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు పోటీపడి మరీ గ్రామాల్లో పనులు చేపట్టారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి జిల్లాలో 166 కిలోమీటర్ల పరిధిలో 1,354 రోడ్డు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. వీటికి సంబంధించి రూ.143 కోట్లు విడుదల చేయాలంటూ ఉపాధి హామీ పథకం వెబ్సైట్లో బిల్లులు అప్లోడ్ చేశారు. మార్చి నెలాఖరు నాటికి నిధులు విడుదల కావాల్సి ఉంది. కానీ అక్టోబర్ నెల కూడా వచ్చేసింది. ఇంకా నిధులు విడుదల కాలేకపోవడంతో కాంట్రాక్టర్ మిగిలిన పనులు నిలిపివేశారు. పనులు పూర్తి చేయాలని సంబంధిత ఉన్నతాధికారులు వేడుకుంటున్నా బిల్లులు విడుదలైతేనే పనులు చేపడతామని కరాఖండిగా కాంట్రాక్టర్లు చెప్పేశారు.
ముఖం చాటేసిన కాంట్రాక్టర్లు
కూటమి ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు ‘పల్లె పండగ’ పనులు చేయడానికి పోటీ పడ్డారు. బిల్లులు రాకపోవడంతో మిగిలిన పనులు పూర్తి చేయకుండా కాంట్రాకర్లు ముఖం చాటేశారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన మంత్రి, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని పెండింగ్ బిల్లులు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే పనులు కుంటుపడతాయి.
పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదిక
పెండింగ్ బిల్లుల విషయాన్ని పీఆర్ ఈఈ వద్ద ప్రస్తావించగా.. రోడ్ల పనులు ఒకింత నెమ్మదిగా జరుగుతున్న మాట వాస్తవమేనని, అయితే పూర్తిగా నిలిచిపోలేదన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. త్వరలో నిధులు విడుదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.