
క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీలను పరిష్కరించండి
● కలెక్టర్ విజయ కృష్ణన్ ● పీజీఆర్ఎస్కు 284 అర్జీలు
వితంతు పింఛన్ మంజూరు చేయండి..
నా భర్త మరణించి మూడేళ్లకుపైగా అవుతోంది. వితంతు పింఛన్ మంజూరు చేయకుండా సచివాలయ సిబ్బంది కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారు. ఈ నెలలో కొత్తగా మంజూరు చేసిన పింఛన్లలో నా పేరు లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాను. మా అత్తకు నాకు వేర్వేరు రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం కలిసి ఉండటం లేదు. అయినప్పటికీ మా అత్తకు పింఛన్ వస్తుందని, సచివాలయ మ్యాపింగ్లో ఒకే కుటుంబంగా చూపిస్తుందని సిబ్బంది చెబుతున్నారు. నిరుపేదగా ఉన్న నాకు పింఛన్ మంజూరు చేసి న్యాయం చేయాలని కోటవురట్ల మండలం కై లాసపట్నం గ్రామానికి చెందిన వితంతురాలు అప్పికొండ రాజేశ్వరి కలెక్టర్కు మొరపెట్టుకుంది.
తుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీలకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆమెతోపాటు జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అర్జీల గురించి వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కరించిన వినతులను దరఖాస్తుదారునికి తెలియజేయాలన్నారు. పరిష్కారం కాని వాటి గురించి అందుకు గల కారణాలు వివరంగా తెలియజేయడం ద్వారా అర్జీలు రీ ఓపెన్ కాకుండా నివారించవచ్చన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలు జిల్లా, మండల అధికారుల లాగిన్లో ఉంటే సంబంధిత అధికారులు నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి, ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని రోజూ పర్యవేక్షణ చేసి నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు, అర్జీదారులు తమ అర్జీల సమాచారం కోసం 1100 కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ వారం మొత్తం 284 అర్జీలు స్వీకరించామని, అధికంగా రెవెన్యూ సంబంధిత సమస్యలు నమోదయ్యాయన్నారు. కార్యక్రమంలో కె.ఆర్.ఆర్,సి, పి.జి.ఆర్.ఎస్ ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్.సుబ్బలక్ష్మి, రమామణి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అఽధికారి శ్రీనివాస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పీడీ శచీదేవి, డ్వామా పీడీ పూర్ణిమాదేవి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నారాయణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం. హైమావతి, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుధీర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణ
రద్దు చేయాలి
ఈ నెల 6న నిర్వహించనున్న ఏపీ బల్క్ డ్రగ్ పార్క్ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రద్దు చేయడంతోపాటు నిర్మాణ పనులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఆర్.శంకరరావు కలెక్టర్ను కోరారు. నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో 1270.80 ఎకరాల భూసేకరణపై ఈఐఏ నివేదిక తప్పుల తడకగా ఉందన్నారు. ప్రజా ప్రయోజనాల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా బలవంతపు భూసేకరణపై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. బల్క్ డ్రగ్ పార్కులో నిర్మించే ఫార్మా పరిశ్రమల్లో రసాయన ప్రక్రియపై వాస్తవాలను దాచి తప్పుడు సమాచారం ప్రజలకందిస్తున్నారన్నారు. ఈఐఏ నివేదిక ఆధారంగా జరిగే ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేసి సరైన వాస్తవ నివేదికతో కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో నిర్వాసితులు అభ్యంతరాలు చెబితే కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామంటూ స్థానిక సీఐ, పోలీసులు గ్రామాల్లో ప్రజలను భయపిస్తున్నారన్నారు. సీఐ చర్యలపై విచారణ చేపట్టి సస్పెండ్ చేయాలన్నారు.

క్షేత్రస్థాయిలో పర్యటించి అర్జీలను పరిష్కరించండి