
చిట్టీలు, వడ్డీల పేరిట మోసగించిన టీడీపీ నేత అరెస్ట్
యలమంచిలి రూరల్: చిట్టీలు, డిపాజిట్ల రూపంలో పెద్ద మొత్తంలో నగదు సేకరించి, మోసగించిన యలమంచిలి మున్సిపాలిటీ తెరువుపల్లికి చెందిన టీడీపీ నాయకుడు దాడిశెట్టి పైడియ్య(నానాజీ)ని శనివారం అరెస్టు చేసినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. పరారవుతుండగా కొక్కిరాపల్లి హైవే కూడలి వద్ద పట్టుకున్నట్టు చెప్పారు. గత నెల 27న బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడ్ని శనివారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో నిందితుడు తనకు ఉన్న ఆస్తుల వివరాలు తెలిపాడు.వీటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉండొచ్చని సమాచారం.అయితే నిందితుడు ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తం రూ.4 కోట్ల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు.
రహదారిపై ఆందోళన
మాయమాటలతో మమ్మల్ని నమ్మించి, మా కష్టార్జితం దోచుకుని, నిలువునా మోసగించిన టీడీపీ నాయకుడు దాడిశెట్టి పైడియ్య(నానాజీ)తో మా వద్ద తీసుకున్న లక్షలాది రూపాయల డబ్బు గురించి సమాధానం చెప్పించాలని డిమాండ్ చేస్తూ తెరువుపల్లి గ్రామస్తులు శనివారం రాత్రి యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఠాణా ఎదుట బైఠాయించి నిందితుడ్ని తమకు చూపించాలని కోరారు. నిందితుడితో మాట్లాడేందుకు బాధితులను పోలీసులు అనుమతించకపోవడంతో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పైడియ్యకు తమ గ్రామానికే చెందిన కొందరు అధికారపార్టీ నాయకులు మద్దతిస్తున్నారని బాధితులు ఆరోపించారు.అంతా చట్టప్రకారం జరుగుతుందని,నిందితుడు,అతని కుటుంబ సభ్యులకు ఏఏ ఆస్తులున్నాయో తెలుసుకునేందుకు సంబంధిత అధికారులకు లేఖలు రాశామని, సంయమనం పాటిస్తే నిందితుడికి ఉన్న ఆస్తుల వివరాలన్నీ తెలుస్తాయని,న్యాయస్థానం ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని యలమంచిలి సీఐ ధనుంజయరావు బాధితులకు వివరించి, నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.అయినప్పటికీ బాధితులు ససేమిరా అంటూ ఠాణా ఎదుట బైఠాయించి నిందితుడ్ని మా ఎదుట ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ రాత్రి 10 గంటల వరకూ ఆందోళన కొనసాగించారు.బాధితుల్లో ఎక్కువమంది మహిళలు ఈ సందర్భంగా వారిని నిందితుడు ఎలా మోసగించాడో,ప్రస్తుతం వారంతా ఎంత ఇబ్బంది పడుతున్నారో చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. కొందరు అధికారపార్టీ నాయకులు నిందితుడికి మద్దతునిస్తున్నారని కొందరు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిందితుడు దాడిశెట్టి పైడియ్యతో సమాధానం చెప్పించాలని బాధితుల డిమాండ్
యలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన
కొందరు అధికార పార్టీ నాయకులుమద్దతిస్తున్నారని ఆరోపణ

చిట్టీలు, వడ్డీల పేరిట మోసగించిన టీడీపీ నేత అరెస్ట్