
26 నుంచి సత్యసాయి ప్రేమ రథయాత్ర
దేవరాపల్లి: అనకాపల్లిలో జిల్లాలో ఈ నెల 26 నుంచి సత్యసాయి ప్రేమ రథయాత్ర నిర్వహించనున్నట్టు సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు కశిరెడ్డి అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు దేవరాపల్లిలోని సత్యసాయి మందిరంలో శుక్రవారం మాడుగుల నియోజకవర్గ స్థాయి సత్యసాయి భక్తుల ముఖ్య సమావేశం జరిగింది. సత్యసాయి రఽథయాత్రను ఏయే మార్గాల గుండా నిర్వహించాలనే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ రథయాత్ర దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 24న ప్రారంభమైందన్నారు. నాలుగు ప్రేమ రథాలు దేశమంతా తిరుగుతున్నాయన్నారు. ప్రతి మండలంలోని ప్రధాన మార్గాల మీదుగా ఈ యాత్ర సాగుతుందన్నారు. స్వామి రథం ఊరేగింపు నిర్వహించే మార్గంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అపూర్వ స్వాగతం పలకాలన్నారు. ఈ సమావేశంలో సత్య సాయి సేవా సంస్థల జోన్ ఇన్చార్జి సిహెచ్.వి.రవిశంకర్, సేవాదళ్ ఇన్చార్జి కన్నూరు అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.