అరకులోయ టౌన్: రాష్ట్రంలో గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలకు కేవలం పేర్లు మార్చి కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం అరకులోయలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గన్నెల గ్రామంలో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన ‘సంజీవని’ కార్యక్రమం కొత్తదేమీ కాదని, జగనన్న ప్రభుత్వంలో తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష పథకాలకే రంగులు, పేర్లు మార్చి గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అమ్మ ఒడి, వసతి దీవెన వంటి పథకాల పేర్లు మార్చడం తప్ప, సూపర్ సిక్స్లో కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలేవీ లేవన్నారు. నాడు–నేడు ద్వారా వైఎస్సార్సీపీ హయాంలో పాఠశాల రూపురేఖలు మారిస్తే, నేడు బడుల్లో కనీస వసతులు కూడా కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు సృష్టించని సంపదను ఇప్పుడు సృష్టిస్తాననడం హాస్యాస్పదమని, గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు, విక్రయాలే ఆ సంపదా అని ప్రశ్నించారు. అధికారిక వేదికపై మతం గురించి ప్రస్తావించడం సీఎం స్థాయికి తగదని, వ్యక్తిగత విశ్వాసాలను ఓట్ల కోసం రాజకీయం చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. పూట గడవని గిరిజనులకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సలహాలిస్తున్న చంద్రబాబు, విలాసవంతమైన జీవితం గడుపుతూ తానెందుకు ఒక్కరితోనే ఆగిపోయారో చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలవుతున్నా ఒక్క కొత్త పింఛన్ మంజూరు చేయకపోగా, ఉన్న పింఛన్లను కోత పెట్టారని ఎద్దేవా చేశారు. గ్రామాలకు నిధులు విడుదల చేయకుండా అభివృద్ధి జరగలేదని అధికారులపై కేకలు వేస్తే లాభం లేదని, అది పాలనా వైఫల్యమే అవుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, ఎంపీటీసీ దురియా ఆనంద్ కుమార్, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురామ్, ఉపాధ్యక్షుడు పల్టాసింగి విజయ్ కుమార్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్లు గుమ్మా నాగేశ్వరరావు, సాగెని నాగరాజు, యూత్ కమిటీ అధ్యక్షుడు బోయి కిరణ్ కుమార్, బూత్ కమిటీ ఇన్చార్జ్ కొర్రా అర్జున్, నాయకులు బీబీ కామేశ్వరరావు, జన్ని నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మీరు ఒక్కరితో ఆగిపోయి..గిరిజనులకు సలహాలా?
పేర్లు మార్చడమే కూటమిప్రభుత్వ మార్కా?
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ధ్వజం
కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు


