● మంత్రి బస్సుల్లో ఆత్మగౌరవ గర్జనకు
● టీడీపీ నేతల పర్యవేక్షణలో టీచర్ల తరలింపు
సాక్షి, పాడేరు: విశాఖపట్నంలో నిర్వహించిన ‘ఆత్మగౌరవ గర్జన’ ర్యాలీకి జిల్లా నుంచి డీఎస్సీ ఉపాధ్యాయుల తరలింపు ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం, అధికార టీడీపీ నేతలు ఉమ్మడిగా పర్యవేక్షించారు. మంత్రికి చెందిన ‘నారాయణ’ విద్యాసంస్థల బస్సులను జిల్లాకు అధిక సంఖ్యలో పంపించగా, ఆ వాహనాల్లోనే విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను విశాఖకు తరలించారు. జిల్లాలోని 11 మండలాలకు ప్రత్యేకంగా నారాయణ బస్సులను అందుబాటులో ఉంచారు. డిప్యూటీ డీఈవో చెల్లయ్యతో పాటు ఆయా మండలాల ఎంఈవోలు తమ పరిధిలోని ఉపాధ్యాయులను దగ్గరుండి బస్సుల్లో ఎక్కించారు. ప్రయాణంలో వారికి ఫలహారాలు కూడా పంపిణీ చేశారు. అరకులోయలో టీచర్ల బస్సులను అరకు టీడీపీ ఇన్చార్జి సియారి దొన్నుదొర ప్రారంభించారు. ఇక జిల్లా కేంద్రమైన పాడేరులోని జూనియర్ కళాశాల మైదానంలో టీడీపీ సీనియర్ నేత, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, పాడేరు పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జ్ డప్పోడి బుజ్జిలు ఉదయం 7 గంటలకే చేరుకుని తరలింపు ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. బస్సులు విశాఖకు బయలుదేరే వరకు వారు అక్కడే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 400 మందికి పైగా ఉపాధ్యాయులను ఈ కార్యక్రమానికి తరలించారు. అయితే, విద్యాశాఖ అధికారులు ప్రత్యక్షంగా రాజకీయ నేతలతో కలిసి ఉపాధ్యాయుల తరలింపు ప్రక్రియలో భాగస్వాములు కావడంపై స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


