బీచ్రోడ్డు(విశాఖ): రాష్ట్రంలో డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అంతా ఓ బూటకమని, నిరుద్యోగ యువతను ప్రభుత్వం నట్టేట ముంచుతోందని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ఆరోపించారు. ‘మ్యాప్స్’ (మెగా డీఎస్సీ ఆత్మగౌరవ పోరాట సమితి) ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించిన సభ మంత్రి నారా లోకేష్ సొంత ప్రచారం కోసం ఏర్పాటు చేసిన కపట నాటకమని విమర్శించారు. ఈ ప్రచార సభ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా జరిగితే నారాయణ, శ్రీచైతన్య, బెహరా వంటి ప్రైవేట్ విద్యా సంస్థల బస్సుల్లో జనాలను తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీని వెనుక స్థానిక డీఈవోలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డీఎస్సీతోపాటు స్పోర్ట్స్ కోటాలో జరిగిన అక్రమాలు, అవకతవకల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే విశాఖలో ఇలాంటి సభలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సీబీఐ విచారణను తప్పించుకునేందుకే ఈకార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. దమ్ముంటే తక్షణ మే సీబీఐ విచారణకు ఆదేశించి నారా లోకేష్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని, లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


