మాట్లాడుతున్న సీజీఆర్ఎస్ చైర్మన్,రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి సత్యనారాయణ
చింతపల్లి: మన్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను న్యాయస్థానం ద్వారా పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీజీఆర్ఎస్ చైర్మన్, విశ్రాంత జిల్లా జడ్జి డాక్టర్ బి. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వినియోగదారుల నుంచి మొత్తం 17 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విశ్రాంత న్యాయమూర్తి మాట్లాడుతూ.. భారత విద్యుత్ చట్టం–2003 ప్రకారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో 2005లో ఈ ఫోరమ్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వినియోగదారులు తమ సమస్యలపై 1912 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. స్థానికంగా విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలపై నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. లైన్ల మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పు, కాలిపోయిన మీటర్లు, వోల్టేజీ హెచ్చుతగ్గులు తదితర సమస్యలకు న్యాయస్థానం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. విద్యుత్ సరఫరాలో లోపాల వల్ల నష్టపోయిన బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లించేలా న్యాయస్థానం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 606 ఫిర్యాదులు రాగా, వాటిలో 446 సమస్యలను పరిష్కరించామని, బాధితులకు నష్టపరిహారంగా రూ. 22.16 లక్షలు చెల్లించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ టెక్నికల్ సభ్యుడు రాజబాబు, ఆర్థిక సభ్యుడు సుబ్బారావు, పాడేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్. పాత్రుడు, ఏడీ సన్నీరాంబాబుతో పాటు చింతపల్లి,గూడెంకొత్తవీధి, కొయ్యూరు, జి.మాడుగుల ఏఈఈలు ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు.


