ముంచంగిపుట్టు: మండలంలోని జర్రెల, బంగారుమెట్ట, వనుగుమ్మ, ఏనుగురాయి పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో బుధవారం ఉపాధి హామీ వేతనదారులు నిరసనకు దిగారు. ఉపాధి హామీ పనుల్లో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ యాప్ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. యాప్ సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రతిరో జూ పని ప్రదేశంలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని, దీనివల్ల పనికి ఆటంకం కలుగుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా హాజరు నమోదు కాక, కష్టపడి పనిచేసినా కూలీ రావడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండలు మండిపోతున్నా పని ప్రదేశాల్లో కనీసం తాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జర్రెల పంచాయతీ మాజీ సర్పంచ్ నాయకం భాగ్యవతి, గిరిజన సంఘం మండల కార్యదర్శి కె. నర్సయ్య మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో తీసుకొచ్చిన మార్పులు వేతనదారులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని విమర్శించారు.యాప్ వల్ల రెండు, మూడు గంటల సమయం వృథా అవుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే పనులు కల్పించి వేతనదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, సంఘాల నాయకులు సురేష్, సుందర్రావు, దేవన్న, బాలన్న, రాజయ్య, చందులతో పాటు పెద్ద సంఖ్యలో వేతనదారులు పాల్గొన్నారు.


