పాడేరు రూరల్: మండలంలోని డోకులూరు పంచాయతీ కేంద్రంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తమరర్బ శివలింగం నాయుడు జ్ఞాపకార్థం, రాష్ట్రీయ ఆదివాసీ ఏక్తా పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. డేగలవీధి, బర్సింగి, కుంచపల్లి, డి.గొందూరు తదితర గ్రామాల నుంచి సుమారు 150 మంది బాధితులు హాజరుకాగా, వారికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగసత్య హేమలత మాట్లాడుతూ.. గిరిజన గ్రామాల ప్రజలు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలని కోరారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ఎంతో అవసరమని సూచించారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి వైద్యుల సలహాలు పొందాలని హితవు పలికారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై పరస్పరం అవగాహన కల్పించుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ నిరంజన్, స్థానిక మాజీ సర్పంచ్ సన్నిబాబు, సెక్రటరీ సతీష్, తమర్బ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


