మోదమ్మ జాతరపై రాజకీయ పెత్తనం తగదు | - | Sakshi
Sakshi News home page

మోదమ్మ జాతరపై రాజకీయ పెత్తనం తగదు

Apr 17 2026 11:02 AM | Updated on Apr 17 2026 11:02 AM

మాట్లాడుతున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు,

మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తదితరులు

మోదకొండమ్మ ఆలయంలో శుద్ధి చేస్తున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాసవిశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, గ్రామ పెద్దలు

సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్యదైవం పాడేరు మోదకొండమ్మ తల్లి జాతరను రాజకీయం చేయడంపై ఎమ్మెల్యే, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతర నిర్వహణలో కూటమి ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తీరును నిరసిస్తూ గురువారం పాడేరులోని ఆలయంలో గ్రామ పెద్దలు, వర్తకులు, వివిధ పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆవేదన చెందుతూ, ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పెద్దలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో జాతరను మే 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని గతంలోనే నిర్ణయించామని ఎమ్మెల్యే తెలిపారు. పండగ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, కలకత్తా లైటింగ్‌ వంటి కార్యక్రమాలకు అడ్వాన్స్‌లు కూడా చెల్లించామని పేర్కొన్నారు. అయితే, కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మంత్రి సంధ్యారాణి ఏకపక్షంగా వ్యవహరిస్తూ, జాతరను మే 17, 18, 19 తేదీలకు మార్చడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. 40 ఏళ్ల జాతర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంత్రులు రాజకీయాలు చేయడం దుర్మార్గమని, ప్రభుత్వం ఉత్సవ కమిటీకి పైసా ఇవ్వకపోయినా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

రాజకీయ జోక్యం సిగ్గుచేటు:

మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గిరిజనుల ఆరాధ్యదైవమైన మోదమ్మ ఉత్సవాలలో కూటమి ప్రభుత్వం రాజకీయ పెత్తనం చేయడం సరికాదన్నారు. స్థానిక పెద్దలు నిర్ణయించిన తేదీలను మంత్రి మార్చడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో జాతర ఘనంగా జరుగుతుందనే అసూయతోనే మంత్రి ఇలా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి జాతర సంప్రదాయాలు తెలిసినా రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు. పాత నిర్ణయం ప్రకారమే మే 10 నుంచి జాతరను ఘనంగా నిర్వహించేందుకు తామంతా కట్టుబడి ఉన్నామని, ప్రభుత్వం భక్తుల మనోభావాలను గౌరవించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు వైస్‌ ఎంపీపీ కె.కనకాలమ్మ, జి.మాడుగుల మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు,పాడేరు మాజీ సర్పంచ్‌ వర్తన పిన్నయ్యదొర, గిరిజన ఉపాధ్యాయ సంఘ నేత కిల్లు గంగన్నపడాల్‌, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటిబాబునాయుడు, బీజేపీ నేతలు సల్లా రామకృష్ణ.బి.కేజీయారాణి, ఎంపీటీసీలు గిడ్డి విజయలక్ష్మి, లకే రామకృష్ణపాత్రుడు, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ అధ్యక్షురాలు ఉర్వశిరాణి, ఎస్టీసెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు శరభ సూర్యనారాయణ, మాజీ ఎంసీ చైర్మన్‌ లకే రామసత్యవతి, వైఎస్సార్‌సీపీ నేతలు కె.సూరిబాబు, కొట్టగుళ్లి నాగేంద్ర, కొండాజీ, బోనంగి వెంకటరమణ, కూడి వలసంనాయుడు, కొట్టగుళ్లి చిన్ని, వర్తక సంఘ నేతలు రొబ్బి శంకరరావు, శివరాత్రి నాగేశ్వరరావు, రొబ్బి మధు, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ధ్వజం

గిరిజన మంత్రి సంధ్యారాణి తీరును నిరసిస్తూ ఆలయం శుద్ధి నిర్వహణ

భక్తుల మనోభావాలు దెబ్బతినేలా

ఆమె తీరు ఉందని ధ్వజం

Advertisement
 
Advertisement
Advertisement