చింతపల్లి: పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదిత్యవర్మ గురువారం చింతపల్లిలోని ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. పీవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మొదటిసారిగా చింతపల్లికి విచ్చేసి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతానికి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ముత్యాలమ్మ జాతర సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి, ఇసుకేస్తే రాలనంత జనంతో కోలాహలంగా కనిపించాయి. పీవోతో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంపీడీవో సీతామహాలక్ష్మి, తహసీల్దారు శంకర్రావు, ఆస్పత్రి పర్యవేక్షకులు నీలవేణి, ఇతర శాఖల అధికారులు, ఎంపీపీ అనూషదేవి, జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య, మాజీ సర్పంచ్ పుష్పలత అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
అన్నసమారాధన
ప్రతి ఏటా ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అన్నదానంలో భాగంగా, గురువారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నాలుగు వేల మందికి పైగా భక్తులకు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
కట్టుదిట్టమైన భద్రత
చింతపల్లి: ముత్యాలమ్మ జాతర సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా కటుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండు రోజుల జాతర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జరిగింది. బుధవారం రాత్రి ఆయన ఆలయం నుంచి వాహనాలు పార్కింగ్, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలను నేరుగా పరిశీలించారు. పలు సూచనలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు.


