● విద్యార్థులకు వైద్యపరీక్షలు
● కలెక్టర్ నిశాంతి ఆదేశాలు
సాక్షి,పాడేరు: జిల్లాలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతం చేయాలని కలెక్టర్ టి.నిశాంతి వైద్యబృందాలను ఆదేశించారు.అన్ని విభాగాల వైద్యాధికారులతో గురువారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించిన కలెక్టర్ వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులందరికీ ఈనెల 24లోపు తప్పనిసరిగా పూర్తిస్థాయి వైద్యపరీక్షలు నిర్వహించాలన్నారు. గర్భాశయ క్యాన్సర్ నివారణలో భాగంగా 14 ఏళ్లు నిండి,15ఏళ్ల లోపు ప్రతి ఆడపిల్లకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో మలేరియా జ్వరాలు సోకకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, నిర్ణీత గడువులోగా దోమల నివారణ మందు పిచికారి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు దోమతెరలను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఆధార్ నమోదును ఫోన్ ద్వారా అనుసంధానం చేయాలన్నారు. జిల్లాలో వైద్య కళాశాల, అరకు ఏరియా ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకు భవన నిర్మాణాలను త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు.అలాగే జిల్లాలో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి సంబంధించి అధికారులతో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ యంత్రాంగమంతా సమయపాలన పాటించాలని, అంకితభావంతో విధులు నిర్వహించాలని, పెండింగ్ పనులన్ని వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఎంహెచ్వో డాక్టర్ కృష్ణమూర్తినాయక్, ఏడీఎంహెచ్వో డాక్టర్ ప్రతాప్, డీసీహెచ్ఎస్ నీలవేణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, గైనిక్ విభాగం హెచ్వోడీ డాక్టర్ తమర్భ నరసింగరావు పాల్గొన్నారు.


