● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
● బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం, బియ్యం అందజేత
పెదబయలు: మండలంలోని సీకరి పంచాయతీ పన్నెడ గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు పెదబయలు సమీపంలోని మత్స్యగెడ్డలో ఈత కోసం వెల్లి ఊబిలో చిక్కుకుని మృతి చెందడం చాలా బాధాకరమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. గురువారం పన్నెడ గ్రామంలో కోడా ప్రదీప్, గల్లోంగి హర్షిత, పాంగి బబ్లు కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇలాంటి విషాద ఘటనలు జరగడం చాలా బాధాకరమన్నారు.పిల్లలు,పెద్దలు ఈత,చేపల వేటలకు వెళ్లి ప్రమాదాల బారిన పడి మత్యువాత పడుతున్నారన్నారు. మృతుల కుటుంబాల్లో ఒక్కోదానికి ప్రభుత్వం నష్టపరిహారం రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇటీవల హుకుంపేట మండలం భూర్జ పంచాయతీ మాలగుమ్మి జలపాతంలో లోతు తెలియక ముగ్గురు యువతులు మృతి విషయం మరువక ముందే పెదబయలు మత్స్యగెడ్డలో ముగ్గురు మృతి చెందడం బాధాకరమన్నారు. సెలవులకు పిల్లలు ఇళ్లకు వస్తే గమనిస్తూ ఉండాలని తల్లిదండ్రులను కోరారు. పిల్లలకు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన బాద్యత ఉందన్నారు.ఆయా కుటుంబాలకు ఎమ్మెల్యే కొంత ఆర్థిక సహాయం, బియ్యం అందజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల పార్టీ అధ్యక్షుడు మజ్జి చంద్రుబాబు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు సందడి కొండబాబు, సీకరి ఎంపీటీసీ వంతాల ఆనందరావు, మాజీ సర్పంచ్లు గుల్లేలు కృష్ణారావు, వనల్భ సన్యాసి, పండా సుబ్రమణ్యం, మండల వైఎస్సార్సీపీ నేతలు జుంబు పూర్ణయ్య, గోమంగి సూర్యనారాయణ, గల్లోంగి మాలన్న, గల్లొంగి మోహనకుమార్ ఉద్యోగ, ఉపాధ్యాయులు గల్లోంగి సిద్ధేశ్వరరావు, పలాసి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.


