అనంతగిరి (అరకులోయ టౌన్): అనంతగిరి మండలం రొంపెల్లి పంచాయతీ బూరిగ, చినకోనెల గ్రామాల్లో మృతి చెందిన గిరిజనులకు త్వరలోనే డెత్ సర్టిఫికేట్లు జారీ చేస్తామని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హామీ ఇచ్చారు.బూరిగ, చినకోనెల గ్రామాల్లో సుమారు 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఆయా గ్రామాల్లో 18 మంది మృతి చెందగా, వారి మరణ ధ్రువీకరణ పత్రాల కోసం ఏడాది కాలంగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో విసిగిపోయిన గిరిజనులు ఇటీవల మోకాళ్లపై కూర్చొని, చేతులు జోడించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ ఘటనపై ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జేసీ స్పందించారు. గురువారం బూరిగ గ్రామాన్ని సందర్శించిన ఆమె బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న 18 డెత్ సర్టిఫికేట్లను త్వరితగతిన అందజేస్తామని భరోసా ఇచ్చారు. జేసీ హామీతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు మరణించిన తేదీ, సంవత్సరం కచ్చితంగా చెప్పలేకపోవడం వల్లే ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యమైందని తహసీల్దార్ వీరభద్రచారి వివరణ ఇచ్చారు. ఈ నెల 17న రెవెన్యూ బృందం గ్రామాలకెళ్లి సమగ్ర విచారణ జరిపి, నివేదికను జేసీకి అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. డీటీ వంతాల మాణిక్యం, వీఆర్వోలు నాగేశ్వరరావు, రాంబాబు, గ్రామ గిరిజనులు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ హామీ


