సాక్షి, పాడేరు: ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఫలితాలు గత ఏడాది కన్నా ఆశాజనకంగా ఉన్నాయి. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాలకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలో 5,653మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 4,368మంది ఉత్తీర్ణులై 77శాతం ఫలితాలు సాధించారు.అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5,370మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,603 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులై 86శాతం ఫలితాలు సాధించారు.
గురుకులాల్లో మెరుగుపడిన ఫలితాలు : జిల్లా లోని గిరిజన గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ ఫలితాలు మెరుగుపడ్డాయి.జిల్లాలోని తొమ్మిది గురుకుల విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో 1,237మందికి 1,187మంది ఉత్తీర్ణులై 95.96 శాతం ఉత్తీర్ణత సాఽధించారు. జి.మాడుగుల బాలురు, పాడేరు బాలికల గురుకుల కళాశాలల్లో నూరుశాతం ఫలితాలు వచ్చాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1,248మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 1,226మంది ఉత్తీర్ణులై 98.23శాతం ఫలితాలు సాధించారు. గూడెంకొత్తవీధి, అరకులోయ బాలికల గురుకుల కళాశాలల్లో నూరుశాతం ఫలితాలు వచ్చాయి.
కేజీబీవీల్లో..
జిల్లాలోని 11 కేజీబీవీ విద్యాలయాలకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలో 413 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా 390 మంది ఉత్తీర్ణులయ్యారు.94.43 శాతం ఉత్తీర్ణత సాధించారు. అనంతగిరి, జి.మాడుగుల, హుకుంపేట, ముంచంగిపుట్టు కేజీబీవీల్లో నూరుశాతం ఫలితాలు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 414మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా,409మంది ఉత్తీర్ణులై 98.79శాతం ఫలితాలు సాధించారు. అనంతగిరి, డుంబ్రిగుడ, జి.మాడుగుల, హుకుంపేట, ముంచంగిపుట్టు, పాడేరు కేజీబీవీల్లో నూరుశాతం ఫలితాలు వచ్చాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో..
జిల్లాలోని తొమ్మిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలో 1964మంది విద్యార్థులు పరీక్షలు రాయగా1593మంది విద్యార్ధులు ఉత్తీర్ణులై 80.6శాతం ఫలితాలు సాధించారు. అప్పర్ సీలేరు కళాశాలలో మాత్రమే నూరుశాతం ఫలితాలు వచ్చాయి. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 1876మంది పరీక్షలు రాయగా 1571మంది ఉత్తీర్ణులై 88.45శాతం ఫలితాలు సాఽధించారు.


