ముంచంగిపుట్టు: ఆదివాసీ యువతకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగుతుందని జేఏసీ జిల్లా చైర్మన్ రామారావుదొర అన్నారు. మండలంలోని కిలగాడ,లక్ష్మీపురం,పెదగూడ,బూసిపుట్టు పంచాయతీల్లో పలు గ్రామాల్లో సోమవారం ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర సాగింది. ఈ యాత్రలో అధిక సంఖ్యలో గిరిజన యువత పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామారావుదొర మాట్లాడుతూ ఆదివాసీలకు ఉద్యోగ అవకాశాల్లో జరుగుతున్న అన్యాయంపై వివరించారు. షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామక చట్టం తీసుకురావాలని, ఆదివాసీలతోనే గిరిజన ప్రాంత ఉద్యోగాలు భర్తీ చేయాలని, ప్రభుత్వం వెంటనే చట్టం చేసి ఆదివాసీ యువతకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ సత్యాగ్రహ యాత్ర ముంచంగిపుట్టు మండలంలో ముగిసిందని,మంగళవారం నుంచి పెదబయలు మండలంలో ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.


