అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 42 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల సమస్యలు వింటూ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగాదాలు – 27, కుటుంబ కలహాలు – 2, మోసపూరిత వ్యవహారాలు – 2, ఇతర విభాగాలకు చెందినవి – 11 అర్జీలు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటిని ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని దిగువ స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
‘భూ వివాదంలో ప్రాణహాని ఉంది’
అచ్యుతాపురం రూరల్: పూడిమడకలో గ్రామకంఠం వివాదంలో తనకు ప్రాణహాని ఉందంటూ 2వ వార్డు మెంబరు పొన్నమల్ల కొండబాబు సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. గ్రామ అవసరాలకు ఉపయోగపడే గ్రామకంఠం స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదుపై తనపై కక్షతో దాడికి దిగారని, దుర్భాషలాడుతూ చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయాడు. గ్రామ అవసరాలకు ఉపయోగపడే స్థలాన్ని కాపాడి, తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని ఎస్పీని కోరాడు.


