మునగపాక : మునగపాకలో నూతనంగా నిర్మిస్తున్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.కోటి 75 లక్షలు నిధులు మంజూరయ్యాయని బ్రాండిక్స్ ఇండియా ప్రతినిధి దొరైస్వామి తెలిపారు. సోమవారం ఆయన మునగపాకలో నిర్మాణంలో ఉన్న శ్రీ వెంకన్న ఆలయ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంత భక్తుల చిరకాల వాంఛగా నిలిచిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్యామ్యులు కావడం సంతోషకరమన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా మునగపాకలోని వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేయడం అదృష్టమన్నారు. ఆలయ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా పెద్ద మొత్తంలో నిధులు సమకూరేలా సహకరించిన బీజేపీ సీనియర్ నేత మాధవ్, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ కృషి అభినందనీయమన్నారు. ఆలయ నిర్మాణంలో మరింతగా భాగస్వాములై ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో మునగపాక సర్పంచ్ దిమ్మల అప్పారావు, గ్రామ పెద్దలు పెంటకోట స్వామి సత్యనారాయణ, డాక్టర్ బద్దెం సూర్యనారాయణ, దాడి ముసిలినాయుడు,ఆడారి అచ్చియ్యనాయుడు, టెక్కలి పరశురామ్,కాండ్రేగుల జగ్గారావు,పెంటకోట ఉమేష్, మొల్లేటి సత్యనారాయణ, దాడి సూరిబాబు, ఆడారి కాశీబాబు, శరగడం పరదేశినాయుడు, అలంక ప్రకాశరావు, పొలిమేర కృష్ణ పాల్గొన్నారు.


