అరకులోయ టౌన్: గిరిజన ప్రాంతంలోని గిరి రైతులు పండించే పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తూ, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆదివారం మండలంలోని గన్నెల పంచాయతీ ఆర్కే నగర్లో ట్రైబల్ డవలప్మెంట్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ సంస్ధ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రస్తుతం టమాట ధరలు కిలో రూ. 4 కూడా పలకడం లేదని, దీనివల్ల గిరిజన రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూరగాయలు, పంట ఉత్పత్తులు పాడవకుండా దాచుకుని, మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునేందుకు వీలుగా శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలకు సూచించారు.కేవలం పేరుకే కాకుండా, గిరిజనుల ఆర్థికాభివృద్ధికి నిజంగా తోడ్పడే సంస్థల పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. స్థానిక నాయకులు, సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ సంయుక్త కార్యదర్శి జన్ని నర్సింహమూర్తి, మండల పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పల్టాసింగి విజయ్ కుమార్, సంస్థ ప్రతినిధులు, గిరిరైతులు పాల్గొన్నారు.
అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


