● గ్యాస్ లీకై చెలరేగిన మంటలు
కాలిపోతున్న లారీ
జి.మాడుగుల: జి.మాడుగుల–చింతపల్లి రోడ్డు మార్గంలోని కొక్కిరాపల్లి గ్రామం వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒక లారీ పూర్తిగా దగ్ధమైంది. వంట చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై మంటలు అంటుకోవడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
ప్రమాదమిలా..
జాతీయ రహదారి నిర్మాణ పనుల నిమిత్తం వారం రోజుల క్రితం పాడేరు వైపు వస్తున్న ఒక లారీ, సాంకేతిక లోపం కారణంగా కొక్కిరాపల్లి వద్ద నిలిచిపోయింది. ఆ లారీ వద్ద కాపలాగా ఉంటున్న వ్యక్తులు శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్యాస్ స్టౌపై వంట చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న లారీకి వేగంగా విస్తరించడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది.
భయాందోళనలో స్థానికులు
లారీ తగలబడుతున్న సమయంలో పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో, సిలిండర్ పేలుతుందేమోనన్న భయంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పాడేరు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపే లారీ అధిక శాతం దెబ్బతింది. లారీ రోడ్డుపైనే తగలబడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు గంటకు పైగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


