సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో విషాదం
సీలేరు: ఏపీ జెన్కో సీలేరు జలవిద్యుత్ కేంద్రం స్విచ్ యార్డ్లో గురువారం జరిగిన ప్రమాదంలో గంగిరి గణేష్ (24) అనే కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందాడు. 220 కేవీ విద్యుత్ వైర్లను సరిచేస్తున్న క్రమంలో గణేష్ పైనుంచి కిందపడిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతడిని జెన్కో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం చింతపల్లి తరలిస్తుండగా మార్గమధ్యలో గణేష్ ప్రాణాలు కోల్పోయాడు. సీలేరు ఎస్ఐ యాసిన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగింది?
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. జలవిద్యుత్ కేంద్రంలోని స్విచ్ యార్డు వద్ద 220 కేవీ ఫీడర్ రెండో యూనిట్కు సంబంధించి సాంకేతిక మరమ్మతులు జరుగుతున్నాయి. సుమారు 15 అడుగుల ఎత్తులో పని చేస్తున్న గణేష్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. పనిచేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడం వల్లే గణేష్ కిందపడిపోయాడని తోటి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై డీఈఈ శ్రీనివాసులు వివరణ ఇస్తూ.. స్విచ్ యార్డులో హాట్లైన్ పెండింగ్ పనుల కోసం ఎల్సీ తీసుకున్నాం. గణేష్ సేఫ్టీ బెల్ట్ ధరించినప్పటికీ, స్టాక్ విరిగిపోవడంతో ప్రమాదం జరిగింది. రెండు వైపులా ఐసోలేటర్లు తెరిచి ఉంచి, ఎర్తింగ్ కూడా చేశాం కాబట్టి విద్యుత్ షాక్ తగిలే అవకాశం లేదు అని తెలిపారు.
గ్రామంలో విషాద ఛాయలు
గణేష్ మృతి వార్త తెలియడంతో సీలేరు గ్రామంలో విషాదం నెలకొంది. అందరితో సరదాగా ఉండే యువకుడు కళ్లముందే విగతజీవిగా మారడంతో స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. జలవిద్యుత్ కేంద్రం ఈఈ రాజేంద్రప్రసాద్, ఎస్ఈ హనుమ తదితర అధికారులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు.
నష్టపరిహారం చెల్లించకుంటే ఆందోళన..
మృతుడి కుటుంబానికి రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం మండల కార్యదర్శి ఎ. బుజ్జిబాబు డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన ఆరోపించారు. నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఇద్దరికి ఉపాధి కల్పించాలని కోరారు. అనుభవజ్ఞులైన శాశ్వత ఉద్యోగులు ఉండగా, ప్రమాదకరమైన పనులను కాంట్రాక్ట్ కార్మికులతో చేయించడం దారుణమని విమర్శించారు.
సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో విషాదం


