శివరాత్రి శోభ
గిరిజన గ్రామాల్లో మహాశివరాత్రి ఆధ్యాత్మిక శోభ ముందే సంతరించుకుంది. హుకుంపేట మండలం దొంతురాయి గ్రామంలో గిరిజనులు గురువారం నాడే శివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ప్రారంభించారు. గ్రామంలోని నాగదేవత పుట్ట వద్దకు ఉదయం నుంచే గిరిజనులు పోటెత్తారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. రోజంతా ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి. పూజా కార్యక్రమాల అనంతరం, దొంతురాయి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడ్డుమండ పంచాయతీ శివాలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో ఘటాలను నెత్తిన ధరించి, శివనామ స్మరణ చేస్తూ భక్తులు సాగారు. – సాక్షి, పాడేరు


