కొనసాగుతున్న దళిత రైతుల దీక్షలు
రాంబిల్లి (అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్లలో దళిత రైతులు నిర్వహిస్తున్న నిరసన దీక్షలు గురువారంతో ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. తమకు అప్పగించిన డీ పట్టా భూముల్ని తప్పుడు నివేదికలు చూపించి స్వాధీనం చేసుకోవాలని అధికారులు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ దళిత రైతు కుటుంబాలు దీక్షలకు దిగాయి. గురువారం దీక్షా శిబిరం వద్ద వంటా వార్పు నిర్వహించారు. కాగా సర్వే నంబర్ 2లో పనులు చేపడుతున్న పొక్లెయిన్ని దళితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వీరిని నియంత్రించేందుకు వచ్చిన ఎంఆర్వోను డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ భూమిలో పనులు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించారు. కూటమి నేతలకు దళిత దీక్షలు కంటగింపుగా మారిందని, తమకు న్యాయం జరిగే వరకూ నిరసన దీక్షలు ఉపసంహరించబోమని దళితులు స్పష్టం చేశారు.


