డీసీసీబీలో చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్టు
అనంతగిరి మండలం వెలగలపాడు వాసిగా గుర్తింపు
దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ)లో ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి చోరీకి యత్నించిన కేసులో నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు కె.కోటపాడు ఇన్చార్జి సీఐ పి.అప్పలరాజు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడు, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైవాడ జలాశయం అతిథి గృహం సమీపంలోని బ్యాంకు వెనుక భాగంలో ప్రహరీ దాటి లోపలికి ప్రవేశించాడన్నారు. మేనేజర్ గది కిటికీ ఐరన్ గ్రిల్ను తన వద్ద ఉన్న ఇనుప రాడ్తో తొలగించి బ్యాంకులోకి చొరబడినట్టు చెప్పారు. సీసీ కెమెరాలో తన ముఖం రికార్డు అవుతుందని గమనించి తలపై స్వెటర్ కప్పుకుని లైట్లు ఆఫ్ చేసి చోరీకి యత్నించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. క్యాష్ కౌంటర్లలో నగదు దొరకకపోవడంతో లాకర్ను తెరవడానికి యత్నించి విఫలమై అదే మార్గంలో పరారైనట్లు తెలిపారు. బ్యాంక్ మేనేజర్ పూర్ణచంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనకాపల్లి డీఎస్పీ ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలించినట్టు చెప్పారు. సీసీ ఫుటేజీలో ఫొటో ఆధారంగా నిందితుడు అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు వెలగలపాడుకు చెందిన వ్యక్తిగా నిర్ధారించుకున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దేవరాపల్లి శారదానది వంతెన వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా వచ్చిన యువకుడు పంది ప్రభాస్ను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ కేసును కొద్ది రోజుల్లోనే ఛేదించిన సంబంధిత సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి అభినందించారు. మండలంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా నిందితుడి ప్రభాస్ను చోడవరం కోర్టుకు తరలించినున్నట్లు పోలీసులు తెలిపారు.


