స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
అరకులోయటౌన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పిలుపునిచ్చారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో అరకులోయ, డుంబ్రిగుడ మండలాలకు చెందిన రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ గుర్తిస్తుందన్నారు. పార్టీ కోసం గ్రామ స్థాయిలో అహర్నిశలు కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించి, వారి గెలుపునకు కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయాలని సూచించారు. అప్పటి పరిస్థితి, సమీకరణలు పరిగణనలోకి అభ్యర్థులకు మద్దతు తెలపనున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థుల గెలుపునకు కష్టపడి పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్, పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జన్ని నరసింహమూర్తి, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు స్వాభి రామూర్తి, పాంగి పరశురామ్, పల్టాసింగ్ విజయ్కుమార్, గుడివాడ ప్రకాష్, ఎంపీటీసీలు స్వాభి రామచందర్, శత్రుఘ్న, వార్డు సభ్యుడు శివ, ముఖ్య నాయకులు బి.బి. కామేశ్వరరావు, మండియకేడి బాలరాజు, పాంగి నాగేశ్వరరావు, పెట్టెలి సుక్రయ్య తదితరులు పాల్గొన్నారు.
దురుద్దేశంతోనే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం
అరకులోయటౌన్: తిరుమల వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డూ ప్రసాందలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ... దురుద్దేశంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలోని అత్యున్నత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎస్డీడీబీ, ఎన్డీఆర్ఐ వంటి ల్యాబ్లలో చేసిన పరీక్షల్లో తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టమైందన్నారు. కానీ అసత్య ఆరోపణలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే మండి పడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వేంకటేశ్వర స్వామికి, దేశ, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు.
అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం


