గిరిజన విద్యార్థుల సంరక్షణపై తీవ్ర నిర్లక్ష్యం
పాడేరు : గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంరక్షణపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పాడేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అద్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆరోపించారు. రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో ఇటీవల తరచుగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగి వందల సంఖ్యలో గిరిజన విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు కనీసం నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు, నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్యా బోధన కరవయ్యాయని చెప్పారు. చాలీచాలని వసతులతో నాసిరకమైన ఆహారంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పారు. విద్యార్థులు తాగేందుకు గుక్కేడు రక్షిత నీరు కరువైందన్నారు. ఆశ్రమ వసతి గృహాల్లో హెల్త్వలంటీర్లను నియమిస్తామని ఊదరగొట్టిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేడం లేదని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో గిరిజన విద్యార్థులకు అన్ని రకాల వసతులతో నాణ్యమైన విద్య, రుచికరమైన ఆహారం అందేదని చెప్పారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఫుడ్పాయిజన్ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గిరిజన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైఎస్సార్సీపీ పోరాటాలను కొనసాగిస్తుందన్నారు.
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి


