ముఖ్యమంత్రి ఆరోపణలు సిగ్గుచేటు: మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్
పాడేరు : రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి పాలనను గాలికొదిలేసి, ప్రతిపక్షంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విమర్శించారు. శనివారం పాడేరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరుమల లడ్డూను అత్యంత పవిత్రంగా, అన్ని అనుమతులతో భక్తులకు అందించిందని ఆమె స్పష్టం చేశారు. జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ బురదజల్లే ప్రయత్నమేనని మండిపడ్డారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణలో నెయ్యి కల్తీ జరగలేదని నిర్ధారణ అయిందని, దీంతో కూటమి నేతలు ముఖం ఎక్కడ పెట్టు కోవాలో తెలియక కొత్త డ్రామాలకు తెరతీశారని భాగ్యలక్ష్మి విమర్శించారు. తిరుమల ప్రతిష్టను, హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఇప్పుడు లడ్డూలో రసాయనాలు కలిశాయని ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం చేస్తున్న ఈ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కూటమి ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తారని ఆమె హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.


