ఆదివాసీల సంక్షేమం పట్టని సర్కారు
● చలి ఉత్సవాల పేరిట
రూ.కోట్ల ఖర్చు దారుణం
● ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర విమర్శ
అరకులోయ టౌన్: గిరిజన ప్రాంతంలో ఆదివాసీల సమస్యలు కోకొల్లలుగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకుల కోసం రూ.కోట్లు వెచ్చించి చలి ఉత్సవాలు నిర్వహించడం అన్యాయమని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర విమర్శించారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చలి ఉత్సవాలు నిర్వహించడంపై ఉన్న శ్రద్ధ గిరిజనుల సంక్షేమంపై చూపాలన్నారు. మండలంలోని శిరగాం పంచాయతీ కప్పలగొంది, డెర్ని ప్రాంత వాసులు గెడ్డ దాటడానికి వీలులేక గ్రామ గిరిజనులు చెక్క వంతెన ఏర్పాటు చేసుకొని రాకపోకలు సాగిస్తున్నారన్నారు. హుకుంపేట మండలం భూర్జ పంచాయతీ చులిపకన, దిగుసల్తంగి, ఎగుసల్తంగి, కొండైపాడు, సొంటరిపాడు గ్రామ గిరిజనులకు రహదారి సౌకర్యం లేక గర్భిణులు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారిని డోలీలో ఆస్పత్రికి తరలిస్తున్నారన్నారు. ఆదివాసీ నిరుద్యోగ యువత జీవో నంబరు 3 చట్టబద్ధతపై ఆందోళన చేస్తున్నారని వాటి పరిష్కారానికి చంద్రబాబు చొరవ చూపలన్నారు. ఆదివాసీలకు జలసమాధి చేసే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి జారీ చేసిన జీవోలు 2,13,51 రద్దు చేయాలని పోరాడుతుంటే ఈ సమస్యలన్నింటిని పక్కన పెట్టి రూ. కోట్లు ఖర్చు చేసి చలి ఉత్సవం నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించారు. చలి ఉత్సవాలకు కేటాయించే నిధులతో మారుమూల గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మిస్తే గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలకు స్వస్తి పలికి, గిరిజనులకు రహదారులు, వంతెనలు, ఇతర సంక్షేమ పథకాలు అమలు చేయాలని సురేంద్ర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, గిరిజనులు పాల్గొన్నారు.


