ఐబీ కొండపై కొత్త అందాలు
● రూ. 65 లక్షలతో అత్యాధునిక గెస్ట్ హౌస్
● కసరత్తు మొదలుపెట్టిన జెన్కో అధికారులు
సీలేరు: ఈ ప్రాంతంలో ఏపీ జెన్కో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన ఊపందుకుంది. ఈ భారీ ప్రాజెక్టు పర్యవేక్షణకు వచ్చే ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతినిధుల వసతి కోసం సీలేరులోని ఐబీ కొండపై రూ. 65 లక్షల అంచనా వ్యయంతో నూతన అతిథిగృహ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 1950 ప్రాంతంలో జల విద్యుత్ కేంద్రం నిర్మాణ సమయంలోనే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ నిర్మించారు. ప్రకృతి ఒడిలో, జలాశయం పక్కన ఉండే ఈ ప్రాంతం పర్యాటకులను, ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మెగా ఇంజినీరింగ్ కంపెనీ ఈ నూతన గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను టెండర్ ద్వారా దక్కించుకుంది. ఇప్పటికే కొండపై స్థలాన్ని చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు పనులు మొదలైతే అధికారుల రాక పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న వసతి సరిపోకపోవడంతో, పాత గెస్ట్ హౌస్ పక్కనే ఆధునిక సౌకర్యాలతో దీనిని నిర్మిస్తున్నారు. సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీరు కేవీ రాజారావు ఈ పనుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తున్నారు. సముద్ర మట్టానికి ఎత్తులో ఉండే ఈ ప్రదేశం నుంచి సీలేరు గ్రామమంతా కనిపిస్తూ, అధికారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. వీలైనంత త్వరగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.


