దళారుల లూటీ..
విదేశాల్లో మన్యం పసుపునకు భలే డిమాండ్
కిలో రూ.200కు పైగా ధర
స్థానిక మార్కెట్లో దక్కని గిట్టుబాటు
రూ.120 ధరకు మించి చెల్లించని
వ్యాపారులు
కలసిరాని మార్కెట్లో పరిస్థితులు
సంతల్లో కొనుగోలు చేపట్టని
గిరిజన సహకార సంస్థ
ఆర్థిక ఇబ్బందుల్లో సాగు రైతులు
మన్యం పసుపునకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నా, అది పండించే గిరిజనరైతు ఇంట మాత్రం కన్నీరు మిగులుస్తోంది. ఎటువంటి రసాయనాలు లేకుండా, ప్రకృతి సిద్ధంగా పండిస్తున్న ఈ పసుపునకు మార్కెట్లో భారీ ధర ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతుకు దక్కేది మాత్రం నామమాత్రమే. అటు ప్రైవేట్ వ్యాపారుల సిండికేట్, ఇటు గిరిజన సహకార సంస్థ వైఫల్యంతో జిల్లాలోని వేలాది మంది రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. రెండేళ్ల కష్టానికి తగిన ప్రతిఫలంఅందక,పెరుగుతున్న సాగు ఖర్చులతో గిరిజన రైతాంగం ఆవేదన చెందుతోంది.
నాణ్యతలో మేటి..
సాక్షి, పాడేరు: జిల్లాలో పసుపు సాగు చేస్తున్న గిరిజన రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరు ఎటువంటి రసాయనాలు వాడకుండా, కేవలం ఆవుపేడను ఎరువుగా ఉపయోగించి సుమారు 30 వేల ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. రెండేళ్లకు ఒకసారి పంటను సేకరించడం వల్ల మన్యం పసుపునకు మంచి రంగు (ఛాయ), ఘాటు ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ పసుపునకు విపరీతమైన డిమాండ్ ఉంది.
మార్కెట్ ధరల్లో వ్యత్యాసం
జాతీయ మార్కెట్లో మన్యం పసుపు ధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతుకు మాత్రం దక్కడం లేదు. అక్కడ కిలో రూ.200కు పైగా ఉంది. స్థానిక వ్యాపారులు మాత్రం కిలోకు రూ.110 నుంచి రూ.120 మాత్రమే చెల్లిస్తున్నారు.
● 2023లో కిలో రూ. 150 పలకగా, 2024 నాటికి ఆ ధరను వ్యాపారులు మరింత తగ్గించేశారు. ప్రైవేట్ వ్యాపారులు అంతా ఒకటై, నాణ్యత మరియు తేమ సాకులు చూపిస్తూ ధరలను తక్కువగా నిర్ణయిస్తున్నారు.
జీసీసీ వైఫల్యం
గిరిజన సహకార సంస్థ కిలోకు రూ. 115 మద్దతు ధర ప్రకటించినప్పటికీ, సంతల్లో నేరుగా కొనుగోళ్లు చేపట్టకపోవడంతో దళారీలదే రాజ్యమవుతోంది. వ్యాపారుల కంటే తక్కువ ధరను ప్రకటించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రమకు తగ్గ ఫలితం లేదు
పసుపు తవ్వడం, ఉడకబెట్టడం, ఎండబెట్టడం మరియు పాలిష్ చేయడం వంటి పనులకు కూలీల ఖర్చు, శ్రమ చాలా ఎక్కువ. అందుకు తగ్గట్టుగా ఆదాయం రావడం లేదని గిరి రైతులు వాపోతున్నారు.
● ఎకరానికి రెండేళ్లకు ఓసారి రూ. 80 వేల ఆదాయం వస్తున్నప్పటికీ, పెరుగుతున్న సాగు ఖర్చులతో పోలిస్తే ఇది ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను అందిస్తున్న గిరిజన రైతులకు గిట్టుబాటు ధర దక్కాలంటే ప్రభుత్వం, గిరిజన సహకార సంస్థ జోక్యం చేసుకుని, నేరుగా సంతల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మన్యంలో పండిస్తున్న పసుపునకు ఇతర రాష్ట్రాలలో డిమాండ్ ఉన్నా.. కొనుగోలు ధరలను మాత్రం స్థానిక వ్యాపారులు పతనం చేస్తున్నారు. కిలో రూ.115 కొనుగోలు ధర జీసీసీ ప్రకటించడం అన్యాయం. ప్రభుత్వం పసుపునకు గిట్టుబాటు ధర కల్పించి ఐటీడీఏ ద్వారా సంతల్లో కొనుగోలు చేయాలి. – కుర్తాడి సోమేశ్వరరావు, పసుపు రైతు,
వి.కోడాపుట్టు, పెదబయలు మండలం
పసుపు సాగుతో నష్టాలే
పసుపు సాగు నష్టాలు మిగులుస్తోంది. మార్కెట్లో కిలో పసుపు కొనుగోలుకు వినియోగదారులు రూ.400 వెచ్చిస్తున్నారు. కష్టపడి సాగు చేసిన గిరి రైతులకు మాత్రం వ్యాపారులు రూ.120కు మించి ధర చెల్లించడం లేదు. ఎకరాకు అన్ని ఖర్చులు పోను రూ.20 వేలకు మించి ఆదాయం రావడం లేదు.
– బడ్నాయిని బాలన్న, పసుపు రైతు, ఉర్రాడ, హుకుంపేట మండలం
దళారుల లూటీ..
దళారుల లూటీ..
దళారుల లూటీ..


