వణికిస్తున్న శీతల గాలులు
● ముంచంగిపుట్టులో 8.4 డిగ్రీల
కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగినప్పటికీ చలి, మంచు తీవ్రత కొనసాగుతోంది. బుధవారం ముంచంగిపుట్టు 8.4 డిగ్రీలు, జి.మాడుగులలో 8.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు.
● పాడేరు డివిజన్ పరిధి పెదబయలులో 10.0 డిగ్రీలు, అరకువ్యాలీలో 10.8 డిగ్రీలు, డుంబ్రిగుడలో 12.1 డిగ్రీలు, చింతపల్లిలో 12.5 డిగ్రీలు, హుకుంపేటలో 12.7 డిగ్రీలు, పాడేరులో 12.9 డిగ్రీలు, కొయ్యూరులో 15.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు ఏడీఆర్ పేర్కొన్నారు. గత వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతల్లో స్వల్పంగా మార్పులు చోటుచేసుకుంటున్నా సాయంత్రం అయ్యేసరికి శీతల గాలులు కొనసాగుతున్నాయి. ఉదయం పది గంటల వరకు మంచు దట్టంగా కురిసింది. రహదారులను మంచు తెరలు కమ్మేశాయి. వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు.


