అరకులో చలి పంజా
● 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
● డుంబ్రిగుడలో తగ్గుముఖం
● చింతపల్లి ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్
అప్పలస్వామి వెల్లడి
చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజులుగా మరింత దిగజారుతున్నాయి. మంచు, చలి తీవ్రతకు మన్యం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం అరకువ్యాలీలో 4.4 డిగ్రీలు, డుంబ్రిగుడలో 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 4.8, ముంచంగిపుట్టులో 5.0, పాడేరులో 5.2,హ హుకుంపేటలో 9.6, చింతపల్లిలో 6.2, పెదబయలులో 6.7, కొయ్యూరులో 11.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 9.4, మారేడుమిల్లిలో 9.9, రాజవొమ్మంగిలో 11.7 ,అడ్డతీగలలో 13.0, రంపచోడవరంలో 13.6,గంగవరంలో 16.7, చింతూరు డివిజన్ చింతూరులో 13.3, ఎటపాకలో 13.9 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. చలిని ఉపశమనం పొందేందుకు మన్యం వాసులు మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
సాక్షి,పాడేరు: జిల్లాలో చలితీవ్రత పెరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రజలు చలికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం 9గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉన్ని దుస్తుల వినియోగం పెరిగింది.
పర్యాటకులకు ప్రాణసంకటంగా..
ఎటపాక: పాపికొండలు సందర్శకులకు పొగమంచు, చలి ప్రాణసంకటంగా మారింది. వీఆర్ పురం మండలంలోని పోచవరం లాంచీల రేవుకు భద్రాచలం నుంచి వచ్చే వారు ఎటపాక మండలం మీదుగా కూనవరం నుంచి వీఆర్పురం మండలంలోని పోచవరం రేవుకు వాహనాల్లో వెళ్తుంటారు. వీరంతా భద్రాచలంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో బయలుదేరుతారు. ఒక పక్క చలి, మరోపక్క మంచు తెరలు కమ్ముకోవడంతో రేవుకు వెళ్లేవారు సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.


