● వైభవంగా నిత్యకల్యాణం ● శాస్త్రోక్తంగా గరుడసేవ
అప్పన్నకు విశేషంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి సోమవారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30 నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని జరిపారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందించారు.
శాస్త్రోక్తంగా గరుడసేవ
శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి గరుడసేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వెండి గరుడ వాహనంపై స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంజేపచేశారు. అష్టోత్తరశతనామావళి పూజ నిర్వహించారు. గరుడవాహనం చుట్టూ భక్తులచే ప్రదక్షిణ చేయించారు.


