
గోదావరి వరదలో ఆశల గల్లంతు
ఎటపాక: గోదావరి వరద మిర్చి రైతుల ఆశలు గల్లంతు చేసింది. ఎంతో వ్యవ ప్రయాసలకోర్చి చేపట్టిన సాగును ముంచెత్తింది. కోటి ఆశలతో సాగు చేపట్టిన రైతులకు గోదావరి వరద కన్నీరు మిగిల్చింది. మండలంలోవరి, పత్తి, మిరపను సుమారు 9వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. ఈనేపథ్యంలో గోదావరి వరద భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం 5గంటలకు 50 అడుగులకు చేరుకోవడంతో లోతట్టు ప్రాంతంలోని వందల ఎకరాల్లో పైరు ముంపునకు గురైంది. ఎటపాక, రాయనపేట, చోడవరం, నెల్లిపాక, తోటపల్లి, గన్నవరం, గౌరిదేవిపేట, నందిగామ, మురుమూరు గ్రామాల పరిధిలో సుమారు 180 ఎకరాల్లో మిర్చి పైరు నీటమునిగింది. తోటపల్లి, నెల్లిపాక, వీరాయిగూడెం, గొల్లగూడెం ప్రాంతాల్లో 104 ఎకరాల్లో వరి, 25 ఎకరాల్లో పత్తి పంటలు నీటమునిగినట్టుగా వ్యవసాయాధికారులు గుర్తించారు. నెల్లిపాక ప్రాంతంలో మల్చింగ్ విధానంలో సాగు చేపట్టిన మిర్చికు తీవ్ర నష్టం వాటిల్లింది. వరద నీటిలో డ్రిప్ పైపులు తేలియాడటం, మిర్చి మొక్కలు కుళ్లిపోవడాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
● భద్రాచలం వద్ద గోదావరి వరద ఉగ్రరూపం దాల్చడంతో కూనవరం– భద్రాచలం ప్రధాన రహదారి, మురుమూరు, నందిగామ, నెల్లిపాక వద్ద రహదారి ముంపునకు గురైంది. రాయనపేట వద్ద జాతీయరహదారిపైకి వరద చేరింది. రహదారులు నీట మునగడంతో మండలంలో పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మురుమూరు, నందిగామ గ్రామాలకు తహసీల్దార్ సుబ్బారావు, ఇతర అధికారులు పడవలపై వెళ్లారు. ప్రజలను అప్రమత్తం చేశారు.
మిర్చి రైతుకు కన్నీళ్లు

గోదావరి వరదలో ఆశల గల్లంతు