
కిల్కారి అమలుపై పరిశీలన
పాడేరు : మండలంలోని పలు గ్రామాల్లో ఢిల్లీ నుంచి వచ్చిన ఆర్మన్ కిల్కారి సెంట్రల్ బృందం సోమవారం పర్యటించి, కిల్కారి అమలు తీరును పరిశీలించింది. ఐటీడీఏలోని డీఎంహెచ్వో కార్యాలయాన్ని సందర్శించి డీఎంహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరనాయుడుతో చర్చించింది. బాలింతలు, గర్భిణులకు కిల్కారి సేవలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అడిగి తెలుసుకుంది. కిల్కారి కార్యక్రమాలను మరింత పెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీసింది. అనంతరం మినుములూరు, కిండంగి, గుత్తులపుట్టు, దేవరాపల్లి గ్రామాలను సందర్శించింది. పలువురు గర్భిణులు, బాలింతలతో మాట్లాడి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకుంది. ఈ కార్యక్రమంలో కిల్కారి టీం సభ్యులు అమిత్, భూషణ్, డీపీహెచ్ఎన్వో జి.భూలోకమ్మ, తదితరులు పాల్గొన్నారు.