
మలేరియా నివారణకు చర్యలు
● ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్
నీటిగుంటలో గంబూషియా చేపలను విడిచిపెడుతున్న ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్
చింతూరు: డివిజన్లోని నాలుగు మండలాల్లో మలేరియా నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్టు ఐటీడీఏ పీవో శుభంనొఖ్వాల్ తెలిపారు. స్థానిక సంతమార్కెట్ వద్ద గల నీటికుంటలో సోమవారం ఆయన గంబూషియా చేపలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ డివిజన్లోని 23 చెరువులు, నీటిగుంటలను గుర్తించి 30 వేల గంబూషియా చేపలను వాటిలో వేసినట్టు చెప్పారు. రసాయనాలపై ఆధారపడకుండా పర్యావరణానికి హితమైన ఈ ప్రక్రియ ద్వారా దోమల లార్వాను నిర్మూలించే అవకాశముందన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వలేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పుల్లయ్య, వైద్యాధికారి నిఖిల్, హెచ్ఈవో రాంప్రసాద్ పాల్గొన్నారు.