జీవో నంబరు 3 పునరుద్ధరించాల్సిందే
● గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ ● పాడేరు ఐటీడీఏలో అభిప్రాయ సేకరణ
సాక్షి, పాడేరు: గిరిజనాభివృద్ధికి సంజీవని లాంటి జీవో నం 3ను పునరుద్ధరించాల్సిందేనని పలువురు డిమాండ్ చేశారు. జీవో నంబరు 3 పునరుద్ధరణ, గిరిజన చట్టాల అమలుపై గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతలతో మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ సదా భార్గవి ప్రజాభిప్రాయం సేకరించారు. వర్క్ షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో నూరుశాతం ఉద్యోగాల జీవో నంబరు 3 పునరుద్ధరణకు గిరిజన అభ్యర్థులతోపాటు ప్రజాసంఘాలు పోరాటం చేస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హమీని నిలబెట్టుకుని జీవో నంబరు 3కు ప్రత్యామ్నాయంగా అయినా నూరుశాతం ఉద్యోగాలు పొందేలా మరో జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ జీవో నంబరు 3తో గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాలు, గిరిజన సంక్షేమం సాధ్యమన్నారు.భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు అమలు బాధ్యత పాలకులపైనే ఉందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం టీఏసీలో ఆమోదించిన ఆంశాలను కూటమి ప్రభుత్వం గౌరవించి వెంటనే ప్రస్తుత టీఏసీలో గిరిజనులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు.
ప్రభుత్వ బాధ్యత.. నేతల ఐక్యనినాదం
జీవో నంబరు 3 పునరుద్ధరణ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్ని ప్రజా ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజకీయ పార్టీల నేతలంతా ఐక్య నినాదం చేశారు. సీపీఎం రాష్ట్ర నేత అప్పలనరస, ఆదివాసీ జేఏసీ కన్వీనర్ రామారావుదొర, గిరిజన ఉపాధ్యాయ సంఘం నేత ముఖి శేషాద్రి, చండా ఎలియా తదితరులు మాట్లాడారు. జీవో నంబరు 3 రద్దుతో జరుగుతున్న అన్యాయం, భవిష్యత్లో ఏర్పడే ఇబ్బందులను గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ సదా భార్గవికి సమగ్రంగా వివరించారు.అన్ని గిరిజన ప్రజాసంఘాల నేతలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ సదా భార్గవి మాట్లాడుతూ జీవోనంబరు 3 పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రణాళికపరంగా కృషి చేస్తోందన్నారు. జేసీ, ఇన్చార్జి ఐటీడీఏ పీవో డాక్టర్ అభిషేకగౌడ మాట్లాడారు. న్యాయవాది పల్లా త్రినాథరావు జీవో నంబరు 3 రద్దు, జీవోలు 275,73,375 తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
జీవో నంబరు 3 పునరుద్ధరించాల్సిందే
జీవో నంబరు 3 పునరుద్ధరించాల్సిందే


