
విమ్స్లో కోవిడ్ ప్రత్యేక వార్డు
ఆరిలోవ: నగరంలో కోవిడ్ కలకలం రేపుతుండటంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా, విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్)లో శుక్రవారం 20 పడకలతో కూడిన ప్రత్యేక కోవిడ్ వార్డును సిద్ధం చేశారు.విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. రాంబాబు వార్డును పరిశీలించి, పడకలు, ఆక్సిజన్ యంత్రాలను తనిఖీ చేశారు. కొత్త కోవిడ్ వేరియంట్లైన జేఎన్–1, ఎల్ఎఫ్7, ఎన్బీ 1.8 పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ పరీక్షల కోసం రాపిడ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, పాజిటివ్ వస్తే వెంటనే ఆర్టీపీసీఆర్ పరీక్షలకు పంపిస్తామని తెలిపారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని, సామూహిక కార్యక్రమాలలో పాల్గొనవద్దని, వృద్ధులు, గర్భిణులు ఇళ్లకే పరిమితం కావాలని ఆయన సూచించారు. మాస్కులు, శానిటైజర్లు వాడాలని కోరారు.